రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలం
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు.
ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..
రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు.
కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు.
ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ల్యాబ్కు నమూనాలు
కల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.
5 రోజుల్లో 12 మంది బాధితులు?
చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.


