గ్రామ, వార్డు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీల ఆందోళన
పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేల భారంతో తాము వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని, పని ఒత్తిడి పెంచుతూ ఉద్యోగులు ప్రాణాలు తీస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు ప్లానింగ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీలు (డబ్ల్యూపీఆర్ఎస్) ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూపీఆర్ఎస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం విజయవాడలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు సరైన సర్వీస్ రూల్స్ లేకపోవటంతో ప్రమోషన్లు, వేతనాల వ్యవహారాల్లో జాప్యం జరుగుతోందన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టౌన్ప్లానింగ్ టెక్నికల్ అఫీసర్స్ అసోసియేషన్ అ«ధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్లానింగ్, రెగ్యులరైజేషన్స్ సెక్రటరీల ప్రమోషన్ చానల్ చేయటానికి సర్వీస్ రూల్స్ సవరించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 390 టీపీబీఓ పోస్టులు డబ్ల్యూపీఆర్ఎస్ ద్వారా భర్తీ చేయటానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
వారికి ట్రేసర్ పేస్కేల్ వర్తింపచేసేలా కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు యు.నవీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులతో సంప్రదించి తమకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ వర్తింపచేసేలా కృషి చేయాలని కోరారు. సచివాలయాల సెక్రటరీలు ఎవరూ కూడా పనిఒత్తిడితో ప్రాణాలు కోల్పోవద్దని, విధి నిర్వహణలో సమస్యలుంటే ఉన్నతాధికారులు, తమ తోటి ఉద్యోగులు, అసోసియేషన్ సభ్యులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జేఏసీ రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.


