ప్రకటించిన మూడు యూనియన్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 23 నుంచి 27 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ అనుబంధ మూడు యూనియన్లకు చెందిన నాయకులు ప్రకటించారు. మార్చి 2న విజయవాడలో అంగన్వాడీల మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ), ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ (ఐఎఫ్టీయూ), హెల్పర్స్ యూనియన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.సుబ్బరావమ్మ, జె.లలితమ్మ, వీఆర్ జ్యోతి విజయవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
గతంలో నిర్వహించిన సమ్మె సమయంలో డిమాండ్స్ అంగీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ తుంగలో తొక్కిందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు రూ.20వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 1819 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యూటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు.


