పార్లర్ నడుపుతున్న మహిళతో సహజీవనం
బిడ్డకు జన్మనిచ్చాక దూరమెళ్లిన వైనం!
న్యాయం చేయాలంటూ బాధితురాలి ఆర్తనాదం
విజయనగరం క్రైమ్: జిల్లాలో ఓ పోలీసు అధికారి అనుసరించిన వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. ఖాకీ దుస్తులు వేసుకున్న ఓ ఇన్స్పెక్టర్ స్థాయి యవ్వారం ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. న్యాయం చేయాల్సిన ఓ పోలీస్ అధికారే మహిళను మోసం చేస్తున్నారన్న గుసగుసలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. విజయనగరం వన్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారి ఆ శాఖే ఖంగుతింది.
విజయనగరంలో పార్లర్..
గంట్యాడకు చెందిన ఓ మహిళ విజయనగరంలో బ్యూటీ పార్లర్ నడుపుతోంది. గతంలో విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఓ పోలీస్ అధికారి ఆమెకు గాలం వేసినట్టు తెలిసింది. అయితే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వదిలించుకునే చర్యలు చేపట్టారట. అతడికి భార్య, పిల్లలు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పార్లర్ నడుపుతున్న మహిళ తనను ఎక్కడ వదిలించుకుంటాడేమోనని.. తనకు దక్కించుకునే చర్యలు చేపట్టింది. కొన్నాళ్లు ఇద్దరి మధ్య ఆ యవ్వారం నడిచిందట.
బదిలీతో దూరం..
ఆ ఎస్ఐకి వేరొక ప్రాంతానికి బదిలీ అయ్యింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం చెడింది. సదరు పోలీస్ అధికారి దూరం వెళ్లడం, ఆమెను కలవడం మానేశారు. దీనిపై ఆమె పోలీస్ అధికారిని నిలదీసి, తనకు, బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇక లాభం లేదనుకుని ఆమె ఏకంగా ఐజీ వద్దే పంచాయితీ పెట్టింది. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేందుకు సదరు పోలీస్ అధికారి బాధిత మహిళకు డబ్బులు ఆశ చూపినట్లు సమా చారం. ఒకటి, రెండు కాదు నాలుగు లక్షలు.. అయితే ఆమె మాత్రం నన్ను, నా బిడ్డను సాకాలని, ఆపై నన్ను ఏలుకోవాలని నాకు డబ్బులు వద్దంటూ తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఖాకీ పంచాయితీ ఎస్పీ వరకు వెళ్లడం, ఐజీ దృష్టిలో పడడంతో పోలీసు శాఖ మొత్తం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు సమాచారం.
ఫిర్యాదు వచ్చింది
తనకు రక్షణ కావాలంటూ ఓ మహిళ విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను సీఐగా చార్జ్ తీసుకోక ముందు అప్పటి ఇన్చార్జ్ సీఐగా ఉన్నప్పుడు ఫిర్యాదు వచ్చింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ ఆరీ్వ.కె.చౌదరి తెలిపారు.


