పదిలో 'వంద' సాధ్యమేనా? | Plan to improve tenth grade results | Sakshi
Sakshi News home page

పదిలో 'వంద' సాధ్యమేనా?

Feb 18 2026 6:03 AM | Updated on Feb 18 2026 6:03 AM

Plan to improve tenth grade results

ప్రభుత్వానికే ‘పరీక్ష’ 

పదో తరగతి ఫలితాల మెరుగుకు ప్రణాళిక 

సబ్జెక్టు టీచర్లతో వంద రోజుల బోధన 

సెలవురోజుల్లోనూ తరగతులు  నిర్వహించేలా ఆదేశాలు 

ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు తీర్చని సర్కార్‌ 

నిరసనలకు దిగుతున్న టీచర్లు..‘పది’కి వంద ఆటంకాలు

పదో తరగతిలో ఫలితాల మెరుగునకు ప్రభుత్వం వందరోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. మామూలు రోజుల్లో అదనపు తరగతులతో పాటు సెలవు రోజుల్లోనూ సబ్జెక్టు టీచర్లు క్లాసులు చెప్పేలా ఆదేశాలిచ్చింది. అంతా బాగానే ఉన్నా.. ఉపాధ్యాయుల సమస్యలను మాత్రం పూర్తిగా విస్మరించింది. దీంతో ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టగా, పదో తరగతిలో ‘వంద’ శాతం ఫలితాలు సాధ్యమేనా అన్న అనుమానం నెలకొంది.

పుట్టపర్తి అర్బన్‌: విద్యార్థి దశలో కీలకమైనవి పదో తరగతి పరీక్షలు. అందుకే విద్యార్థులు,       తల్లిదండ్రులు పరీక్షల వేళ టెన్షన్‌ పడుతుంటారు. ఇప్పుడు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సరిగ్గా 30 రోజులు మాత్రమే గడువుంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి శ్రీ సత్యసాయి జిల్లాను రాష్ర్టంలోనే ముందు వరుసలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు ప్రభుత్వం నిర్దేశించిన ‘వంద రోజుల ప్రణాళిక’ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు, ప్రత్యేక పరీక్షలు, టెస్ట్‌లు నిర్వహిస్తూ ప్రోత్సహించాలని సూచించారు. అయితే సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణకు సవాలక్ష  సమస్యలు ఎదురవుతున్నాయి.  

అయ్యవార్ల సమస్యలపై అలసత్వం
చంద్రబాబు ప్రభుత్వం పాలన చేపట్టి 20 నెలలు అవుతున్నా, ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 11వ పీఆర్సీ ప్రకటన, సరెండర్‌ లీవులు, పీఎఫ్, మెడికల్‌ బిల్లులు చెల్లించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌       బకాయిలు విడుదల చేయాలని, సీపీఎస్‌         విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, వెంటనే 4 డీఏలు ప్రకటించాలని, పదవీ విరమణ రోజే సౌలభ్యాలు అందజేయాలన్న డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు,  చలో విజయవాడ తదితర కార్యక్రమాలు చేపట్టినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనం రాలేదు.    ఈ పరిస్థితులు పదో తరతి విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.  

జిల్లాలో 22,139 మంది విద్యార్థులు.. 
జిల్లాలో ఈ ఏడాది 22,139 మంది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9,700 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 6,751 మంది, కేజీబీవీల్లో 1,162 మంది, మున్సిపల్‌ పాఠశాలల్లో 1,529  మంది పరీక్ష రాస్తున్నారు. ఇందులో బాలికలు 10,577 మంది ఉండగా, బాలురు 11,562 మంది ఉన్నారు. 2024 సంవత్సరంలో 18,419 మంది (84.46 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 2025 సంవత్సరంలో 15,769 మంది (74.26 శాతం)     ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతుందా... ప్రభుత్వ తీరుతో చతికిల పడుతుందో వేచి చూడాలి.  

వంద రోజుల ప్రణాళిక ఉపయోగపడేనా..? 
పది పరీక్షలకు ముందు వంద రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనికి చాలా మంది విద్యార్థులు డుమ్మా కొడుతున్నారు. సాధారణ రోజుల్లో ఒకరకంగా వస్తున్నా... సెలవు రోజుల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని, సగం మంది కూడా హాజరు కావడం లేదు. పర్యవేక్షించాల్సిన ప్రధానోపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులు భోజనం సరిగా వండటం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు సెలవురోజుల్లో తరగతులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. 

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి  
గతంతో పోలిస్తే ఈసారి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక కృషి చేస్తున్నాం. డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపే హక్కు ఉపాధ్యాయులకు ఉన్నప్పటికీ  సబ్జెక్టు టీచర్లు తప్పని సరిగా ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సిందే. విద్యాశాఖ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ అందరూ వంద రోజుల ప్రణాళికను పర్యవేక్షిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నాం. మెరుగైన ఫలితాల కోసం శ్రమిస్తున్నాం.   – కిష్ణప్ప, జిల్లా విద్యాశాఖ అధికారి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement