చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై విజయవాడ కొత్తపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ లంబాడీపేట ప్రాంతానికి చెందిన బాలిక తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందాడు. తల్లి ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. స్థానికంగా కారు నడుపుతూ జీవనం సాగించే హేమంత్ నాగసాయి (23) ఆ బాలికకు పరిచయమై ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. బాలిక తల్లి ఇంట్లోలేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. కొద్దిరోజులుగా బాలికకు ఒంట్లో బాగోకపోవడంతో తల్లి ప్రశ్నించగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. అనంతరం బాలిక కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హేమంత్ నాగసాయిపై పోక్సో కేసు నమోదు చేశారు.
మూడేళ్ల బాలికపై లైంగిక దాడి
పెదగంట్యాడ: మూడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన విశాఖలోని గంగవరం పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గంగవరంలోని ఓ కుటుంబానికి పరిచయం ఉన్న 17 ఏళ్ల బాలుడు.. బుధవారం బాలిక ఇంటికి వచ్చాడు. బిస్కెట్లు కొనిస్తానంటూ బాలికను తన వెంట తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి ఇంటి వద్ద వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుస్తూ, మానసిక ఆందోళనలో ఉన్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా, బాలిక జరిగిన ఘటనను చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుని జువైనల్ మెజి్రస్టేట్ ముందు హాజరుపరిచి, బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.


