ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా సముద్రంలో నౌకలు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో వినాస్యాలు
సాగర తీరంలో ‘ప్రపంచ’ విన్యాసం అట్టహాసంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
యుద్ధ విన్యాసాల ప్రదర్శనతో సత్తా చాటిన నౌకాదళం
విశాఖ తీరంలో దేశ విదేశాల కళా వైభవ ప్రదర్శన
సిటీ పరేడ్తో పులకించిన విశ్వనగరం
కవాతులో విదేశీ రక్షణ బృందాలు
జనసంద్రమైన ఆర్కే బీచ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చేతక్ హెలికాప్టర్లు ఆకాశం నుంచి మువ్వన్నెల పతకాల్ని మోసుకొచ్చాయి. ఆ వెనుకే ఏఎల్హెచ్ హెలికాప్టర్లు బాణం ఆకారంలో దూసుకొచ్చాయి. సీకింగ్స్.. కమోవ్ వంటి హెలికాప్టర్ల సందడి నడుమ ఐఎస్వీ టాంగోలు సముద్ర జలాల్లోకి దూసుకుపోయాయి. మేఘాల్ని చీల్చుకుంటూ మిగ్–29 యుద్ధ విమానాలు బాంబుల మోత మోగించాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026లో భాగంగా.. విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన సైనిక విన్యాసాలు ఔరా అనిపించాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్డులో భారతదేశ సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాణం పోసేలా నిర్వహించిన సిటీ పరేడ్ కనువిందు చేసింది.
వీటిని వీక్షించిన విదేశీ ప్రతినిధులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఐఎఫ్ఆర్లో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ బృందాలు నిర్వహించిన కవాతు హైలైట్గా నిలిచింది. అత్యాధునిక డ్రోన్ విన్యాసాలు, మెరైన్ కమాండోల సాహసాలతో సముద్ర భద్రత విషయంలో కీలక పాత్ర పోషించబోతోందనే సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి భారత్ సుస్పష్టం చేసింది.
అతిథుల నడుమ అంబరమంటిన సంబరం
గురువారం నాటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లాతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నేవల్ బ్యాండ్ ఆధ్వర్యంలో వందేమాతరం, జనగణమనతో మొదలైన సిటీ పరేడ్ సంబరం అంబరాన్నంటింది.
యుద్ధ విమానాల బాంబుల వర్షం
చేతక్, ఏఎల్హెచ్, సీకింగ్స్, కమోవ్–28, కామోవ్–31, రోమియోలుగా పిలిచే ఎంహెచ్–60ఆర్ హెలికాప్టర్లతో భారత వాయుసేన ఒక్కసారిగా వినువీధిలో ఫైరింగ్ నిర్వహించి సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇమ్మీడియట్ సపోర్ట్ వెసల్స్ ఐఎస్వీ టాంగోలు సముద్ర జలాల్లో దూసుకుపోతుండగా.. గగన తలంలో మేఘాల్ని చీల్చుకుంటూ మూడు మిగ్–29 యుద్ధ విమానాలు దూసుకొచ్చి బాంబుల మోత మోగించాయి. 16వ బెటాలియన్ ద్వారా ప్లటూన్ కమాండర్లు బీఎంపీ–2 యుద్ధ ట్యాంకర్లతో సముద్ర తీరంలోకి దూసుకొచ్చి అతిథులకు గౌరవ వందనం సమర్పించి యుద్ధ విన్యాసాల్ని ప్రదర్శించారు. ఎయిర్ స్క్వాడ్రన్ ఆధ్వర్యంలో నాలుగు డారి్నయర్ ఎయిర్క్రాఫ్ట్లు వజ్రాకృతిలో విన్యాసాలు చేయగా.. మూడు కోస్ట్గార్డ్ ఎయిర్క్రాఫ్ట్లు, భారత నౌకాదళానికి చెందిన పీ–8ఐ వచ్చీ రాగానే బాంబుల వర్షం కురిపించాయి.
యుద్ధ విన్యాసం.. రక్షణ సామర్థ్యం
సముద్రపు దొంగల ఆటని ఎలా కట్టిస్తారు.. సముద్రంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షిస్తారనే అంశాల్ని ప్రదర్శించారు. సీకింగ్ హెలికాప్టర్లు మెరైన్ కమాండర్లు మార్కోస్ని ప్రవేశపెట్టి.. కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఆయిల్ రిగ్ని నాశనం చేసే ప్రదర్శనని వీక్షకుల ఒళ్లు గగుర్పొడించింది. మిగ్–29 యుద్ధ విమానాలు ఒక్కసారిగా దూసుకొచ్చి తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. మూడు మిగ్–29, నాలుగు హాక్ జెట్స్ ఫ్లై పాస్ట్ నిర్వహిస్తూ గగనతల యుద్ధ విన్యాసాల ప్రదర్శన ముగించాయి. అనంతరం ఐఎఫ్ఆర్ భాగస్వామ్య దేశాలైన ఆ్రస్టేలియా, రష్యా, మలేíÙయా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇరాన్, మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, మాల్దీవులు, సియాచెల్, వియత్నాం దేశాల నౌకాదళ సిబ్బంది కవాతు నిర్వహించారు. చివరిగా దేశ ఔన్నత్యాన్ని, భారత నౌకాదళం, రక్షణ దళాల వీరోచిత్వాన్ని చాటిచెప్పేలా లేజర్ షో, డ్రోన్ షోతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాన్ని ముగించారు.
విన్యాసాలు కాదు.. విశ్వాసానికి ప్రతీకలు
అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలకు విశాఖపట్నం మరోసారి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. సముద్ర సరిహద్దుల రక్షణలో మన నావికులు ప్రదర్శిస్తున్న సాహసాలు వెలకట్టలేనివి. అంతర్జాతీయ సిటీ పరేడ్ ప్రపంచ దేశాల మధ్య ఉన్న సముద్ర సంబంధాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే వేదికపైకి తీసుకువచి్చంది. ఇప్పుడు జరిగినవి కేవలం విన్యాసాలు మాత్రమే కాదు. సముద్ర రక్షణకు, స్నేహపూర్వక వాతావరణానికి ప్రతీకలు. భారత్ నిరంతరం ప్రపంచ శాంతిని కాంక్షిస్తుంది. సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం, స్నేహం మెరుగుపడటం దేశ ఆరి్థక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. పరేడ్లో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. ‘సముద్రాల ద్వారా స్నేహం‘ అనే నినాదం నేడు ప్రపంచానికి అత్యంత ఆవశ్యకంగా మారింది. వివిధ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై కవాతు చేయడం శాంతికి చిహ్నం. – జస్టిస్ అబ్దుల్ నజీర్, గవర్నర్
బాధ్యతాయుతమైన శక్తిగా భారత్
74 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం గర్వంగా ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో భారత్ ఒక బాధ్యతాయుతమైన శక్తిగా ఎదుగుతోంది. సముద్ర దొంగతనాలు, ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి మిత్రదేశాల నావికాదళాల మధ్య సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం భారత నౌకాదళం ఎల్లప్పుడూ లైట్హౌస్లా దారి చూపించడంలో ముందుంటుంది. – అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, భారత నౌకాదళాధిపతి


