మిలాన్ దేశాల ప్రతినిధులతో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్
సముద్ర సవాళ్లపై ప్రపంచ దేశాలు ఏకం కావాలి
సాగర జలాల్లో తీవ్రవాదం, అక్రమ రవాణా, పైరసీ పెరుగుతున్నాయి
శాంతి స్థాపన కోసం అన్క్లాస్ చట్టాన్ని బలోపేతం చేయాల్సిందే
అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ ప్రారంభోత్సవంలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
విశాఖలో మిలాన్–2026 సదస్సుకు ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి
ఆసియాన్ దేశాలతో ప్రత్యేకంగా భేటీ
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సముద్ర భద్రత అనేది కేవలం ఒక దేశానికి పరిమితం కాదని.. సముద్ర సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిలాన్–2026’ విన్యాసాలను రాజ్నాథ్సింగ్ విశాఖలో గురువారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ ప్రారం¿ోత్సవంలో ముఖ్యఅతిథిగా రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. 74 దేశాల నౌకాదళ అధిపతులు, ప్రతినిధులు భాగస్వాములై చేపట్టిన ఈ విన్యాసాలు భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యానికి అద్దం పడుతున్నాయన్నారు. భారత్ నమ్మకమైన విశ్వ మిత్రగా ఉంటుందని స్పష్టం చేశారు.
పరస్పర విశ్వాసానికి దోహదం
సముద్ర వ్యాపారం, రవాణా విపరీతంగా పెరిగిన క్రమంలో పైరసీ, తీవ్రవాదం, అక్రమ రవాణా వంటి సవాళ్లు పెరిగాయని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. జలసంధులు, సముద్ర వనరుల యాజమాన్యం విషయంలోనూ వివాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా ఎదుర్కోలేదని, అందుకే ‘మిలాన్’ వంటి వేదికలు పరస్పర విశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.
సముద్ర జలాల్లో శాంతి స్థాపనకు ‘ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం’(అన్క్లాస్) చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ దార్శనికతతో సముద్ర భద్రత కోసం ప్రారంభించిన సాగర్ కార్యక్రమం ఇప్పుడు మహాసాగర్గా రూపాంతరం చెందిందన్నారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి మాట్లాడుతూ మిలాన్ విన్యాసాలను మారిటైమ్ మహాకుంభంగా అభివరి్ణంచారు. కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ డా.సమీర్ వి,కామత్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేడు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం ప్రారంభం
ఐఎఫ్ఆర్, మిలాన్తోపాటు విశాఖలో మూడో అతి పెద్ద కీలక కార్యక్రమం ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం(అయాన్స్) కాంక్లేవ్ శుక్రవారం ప్రారంభం కానుంది. మొత్తం 42 దేశాలకు చెందిన నౌకాదళ అధిపతులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. విశాఖ బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో హిందూ మహా సముద్రంలో సవాళ్లు, సహకారంపై ఆయా దేశాల ప్రతినిధులు కీలకంగా చర్చించనున్నారు.
ఆసియన్ దేశాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి సమావేశం
రాజ్నాథ్సింగ్ తొమ్మిది ఆసియన్ సభ్య దేశాల నౌకాదళాధిపతులు, ప్రతినిధి బృందాలతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్(ఆసియాన్)లో ఉన్న బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం దేశాలతో భారత్ రక్షణ సహకారం మరింత బలోపేతం కానుందని మంత్రి అన్నారు. ‘ఆత్మనిర్భర భారత్’లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చెందిన భారత రక్షణ రంగం నుంచి ఆసియాన్ దేశాలు ప్రయోజనం పొందాలని ఆయన ఆహా్వనించారు.
భారత నౌకాదళ తయారీ సామర్థ్యానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ నిదర్శనమన్నారు. సముద్ర తీర స్థిరత్వం కోసం యువ నౌకాదళ అధికారుల మధ్య పరస్పర అవగాహన పెంచే కార్యక్రమాలు విస్తరించాలని కేంద్రమంత్రి రక్షణ మంత్రి ప్రతిపాదించారు. ‘సఖ్యత, సహకారం, సమన్వయం’ అనే నినాదంతో, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం అందరూ కలిసి పని చేయాలని రక్షణ మంత్రి సారథ్యంలో ఆసియాన్ దేశాలు సమావేశం తీర్మానించాయి.


