షార్ట్ సర్క్యూట్తో పిల్లల వార్డులో పేలిపోయిన రెండు ఏసీలు
తృటిలో తప్పిన పెనుముప్పు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీలు పేలిపోయాయి. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి సిబ్బంది సాయంతో అద్దాలు పగులగొట్టారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని భయంతో అరుస్తూ చీకట్లోనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ వచ్చేలోపు అగి్నమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు బెడ్లకు మంటలు అంటుకోగా, వాటినీ అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఆస్పత్రి అధికారులు డాక్టర్ సుశీల్, డాక్టర్ కళారాణి పిల్లలను ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్ తదితరులు పరిశీలించారు.


