భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
సాక్షి, అమరావతి: కోర్టుల్లో కేసులు పేరుకుపోకుండా మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగపడుతుందని, కక్షిదారులకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మేలైన న్యాయం అందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేతృత్వంలో మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సును ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ మధ్యవర్తిత్వాన్ని కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రాధాన్యం గల పద్ధతిగా చూడాలన్నారు.
ఇదో అద్భుతమైన మార్గమని, మొదటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు ఢిల్లీలో జరిగిందని చెప్పారు. వాస్తవానికి భారతదేశ డీఎన్ఏలోనే మధ్యవర్తిత్వం ఉందని, పురాణ కాలం నుంచే ఇది అమలులో ఉందన్నారు. కురుక్షేత్రం జరగకుండా పాండవులకు, కౌరవులకు మధ్య శాంతి కోసం శ్రీకృష్ణుడు చేసిన రాయబారాన్ని తొలి అధికారిక మధ్యవర్తిత్వంగా ఉదహరించారు.
ఆర్బిట్రేషన్పై విశ్వాసం పెంచుకోవాలి
మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్)తో పరిష్కారమయ్యే కేసులూ కోర్టుల్లో పెండింగ్లో ఉండిపోతున్నాయని, ఆర్బిట్రేషన్ ప్రక్రియపై కక్షిదారులు నమ్మకం పొందడం చాలా ముఖ్యమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 2023లో వచ్చిన మధ్యవర్తిత్వ చట్టంతో దీనికి ఒక చట్టబద్ధత లభించిందని, దీని ద్వారా జరిగే పరిష్కారాలు కోర్టు డిక్రీతో సమానంగా అమలు చేస్తారని స్పష్టం చేశారు. మధ్యవర్తులుగా వ్యవహరించే వారికి సరైన శిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు.
మధ్యవర్తిత్వం అంతర్జాతీయంగానూ ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తోందని, మలేషియాలో మధ్యవర్తిత్వానికి దొరుకుతున్న ప్రోత్సాహాన్ని తాను స్వయంగా చూసినట్టు జస్టిస్ సూర్యకాంత్ ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియేషన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రితో చేసిన మీడియేషన్ విజయవంతం అయిందన్నారు.
ప్రజలు రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలి : హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రజలు న్యాయ పోరాటాల కంటే రాజీ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. జమ్మూ కశ్మీర్లో జడ్జిగా ఉన్న సమయంలో అమెరికాలో సెటిల్ అయిన ఒక వ్యక్తి వారసత్వ ఆస్తి గురించి తనను ఓ న్యాయవాదిగా సంప్రదించారని, అప్పుడు తాను ‘‘ఎందుకు మీరు మీ సోదరునితో మాట్లాడకూడదు’’ అని ఆయనకు చెప్పినట్టు గుర్తు చేశారు. ఆరు నెలల తర్వాత ఆయన కనిపించి తన ఫ్యామిలినీ, తన సోదరుడిని దూరం చేసుకోలేదని తనకు చెప్పారని వివరించారు. రాజీకి ఉన్న శక్తి అలాంటిదని వివరించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరి మాట్లాడుతూ.. చర్చల ద్వారా పరస్పర అంగీకారంతో చాలా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. దీనివల్ల సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. ఏపీ లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం గొప్ప మార్గమని అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యవర్తిత్వ చట్టం ద్వారా దాదాపు 2 లక్షల కేసులు పరిష్కరించినట్టు గుర్తు చేశారు.
కేసులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఇటీవలే దాదాపు 400 మంది న్యాయవాదులకు మధ్యవర్తుల అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా జడ్జిలు, జుడీషియల్ అధికారులు, న్యాయవాదులు, బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
సత్వర న్యాయంతో త్వరితగతిన అభివృద్ధి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, జుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రాలను సమీకృతం చేస్తూ బెస్ట్ జుడీషియల్ సిటీని నిరి్మస్తామని పేర్కొన్నారు.
గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించేవారని, తన తండ్రి కూడా పెద్దరికం వహించి గ్రామంలోని సమస్యలను పరిష్కరించినట్టు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరిస్తే రూ.10 వేలు ఇస్తామని, కేసులు పరిష్కారం కాకున్నా రూ.3 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ–గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు.
న్యాయమూర్తుల గృహ సముదాయం ప్రారంభం
అమరావతిలో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్లతో చేపట్టిన 36 మంది జడ్జిల బంగాళాల సముదాయాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఇక్కడ ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 1 నమూనాలో నిర్మించారు. నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం సముదాయ ఆవరణలో మొక్కలు నాటారు.
మధ్యాహ్నం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన
తాడికొండ: అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. తొలుత జుడీషియల్ అకాడమీ రూపొందించిన ఆడియో, వీడియోను తిలకించిన అనంతరం ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జుడీషియల్ అకాడమీని రూ.165 కోట్లతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బీలో జీ ప్లస్–3 అంతస్తులతో అకడమిక్ బ్లాక్ నిరి్మస్తున్నారు.
జీ ప్లస్–8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్, జీ ప్లస్–3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుంచి ఈ అకాడమీ 5.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి 50 మీటర్ల వెడల్పు కలిగిన రహదారి సౌకర్యం ఉంది. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఎయిర్పోర్ట్లో సీజేఐకి ఘనస్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్కు ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ, అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు గన్నవరం చేరుకున్నారు.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దొనడి రమేష్, జస్టిస్ జయసూర్య, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్ కూడా వచ్చారు. విమానాశ్రయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్కు డీజీపీ హరీష్ కుమార్గుప్తా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలికారు.
అదేవిధంగా సాయంత్రం ప్రత్యేక విమానంలో సీజేఐ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, సీఎం చంద్రబాబు తదితరులు వీడ్కోలు పలికారు.
న్యాయ వ్యవస్థపై విశ్వసనీయత పెరగాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
తిరుపతి లీగల్: ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వసనీయత పెరిగేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. ఆదివారం తిరుపతి మండలం దామినేడు వద్ద కోర్టు భవనాల సముదాయానికి భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని సీజేఐ, ఇతర న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ సత్వర న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. న్యాయవాదులు న్యాయవ్యవస్థలో భాగమని, వారు ప్రత్యేకం కాదన్నారు. నూతన కోర్టు భవన సముదాయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీజేఐ సూచించారు.
న్యాయం ఎప్పటికీ ఆగదు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గతంలో కోర్టులలో సరైన వసతులు ఉండేవి కావని, మహిళా న్యాయవాదులు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పరిస్థితులు క్రమేణా మెరుగు పడుతున్నాయని, కోర్టులలో మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ కనిపిస్తోందని వెల్లడించారు. న్యాయం ఎప్పటికీ ఆగదు.. అదే న్యాయమూర్తుల ఆత్మస్ఫూర్తి అని కొనియాడారు.
2023లో రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఏసీలను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గొప్పదనం భవనాల్లో కాదని, వాటి లోపల జరిగే న్యాయప్రక్రియ, నిష్పాక్షిక తీర్పుల్లో ఉంటుందని పేర్కొన్నారు. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కాదని, ధర్మానికి ప్రతీకని అభివర్ణించారు. అనంతరం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ జయసూర్య, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గొట్టి గజేంద్ర ప్రసంగించారు.
భవన నిర్మాణాలకు సహకరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేష్, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ శేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషాద్రి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.
భూమి పూజకు అటెండర్ను ఆహ్వానించిన సీజేఐ నూతన కోర్టు భవనాల భూమి పూజ చేస్తున్నప్పుడు న్యాయమూర్తులు, ఇతర అధికారులందరూ ఇటుకలు పేర్చి పూజలు చేశారు. ఈ సమయంలో సీజేఐ సూర్యకాంత్ జిల్లా కోర్టు అటెండర్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయన చేత ఇటుక పెట్టించి పూజ చేయించారు. ఈ ఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.


