అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం | Tragic situation in fireworks explosion incident | Sakshi
Sakshi News home page

అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం

Mar 2 2026 2:10 AM | Updated on Mar 2 2026 2:10 AM

Tragic situation in fireworks explosion incident

వాహనంలో వచ్చిన మృతదేహాలను చూసి రోదిస్తున్న కుటుంబ సభ్యులు

బాణసంచా విస్ఫోటనం ఘటనలో దయనీయ పరిస్థితి 

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి.. 22కి చేరిన మృతుల సంఖ్య 

100–150 కిలోల మందు గుండు నిల్వ ఉంచడం వల్లే భారీ ప్రమాదం 

పోలీసుల అదుపులో నిర్వాహకుడు 

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

కాకినాడ క్రైం/సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో విస్ఫోటనం ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. శనివారం జరిగిన పేలుడులో 20 మంది మృతి చెందడం, మరో 11 మంది మంది గాయపడటం తెలిసిందే. వీరిలో తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, వీరిలో సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున, దర్శిపర్తి రాజు (28) ఆదివారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. 

                                                      భార్యాపిల్లలతో లోవరాజు 

మిగిలిన క్షతగాత్రుల్లో సప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, చిటికెల లక్ష్మిలను క్యాజువాలిటీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. మిగిలిన క్షతగాత్రులు కాతేటి శ్రీను, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీనులను బర్న్‌ వార్డుకు తరలించారు. బాధితులు మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

ఇక్కడ కేవలం నలుగురు మాత్రమే పని చేయాల్సి ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో కనీసం 45 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పేలుడు ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు షెడ్ల నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి తప్పించుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం 5 కిలోల ముడి సరుకు మాత్రమే ఉంచేందుకు అనుమతి ఉండగా, 100–150 కిలోల మందు గుండు ఉంచడం వల్లే ఇంతటి భారీ విస్ఫోటనం సంభవించిందన్నారు.   

మృతదేహాల అప్పగింత  
21 మంది మృతదేహాలకు ఆదివారం పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ మృతదేహాలను మహాప్రస్థానం వాహనాలు, అంబులెన్సుల్లో ఆయా గ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాణసంచా తయారీకి వెళ్లవద్దని చెప్పి­నా వినకుండా వెళ్లి కుటుంబానికి ఆసరా లేకుండా చేశారని మృతుల కుటుంబ సభ్యులు రోదించారు. ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

కాగా, ప్ర­మా­దానికి గురైన సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ లైసెన్సుదారు అడబాల అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను శనివారం బాణసంచా ఆర్డర్ల కోసం బయటకు వెళ్లానని, ఆ సమయంలో తయారీ కేంద్రంలో ఉన్న తన తండ్రి శ్రీను కూడా చనిపోయారని అర్జున్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో అర్జున్‌కు నోటీసు ఇచ్చి, తండ్రి అంత్యక్రియలకు అనుమతించామని సీఐ చెప్పారు. కాగా, ఆదివా­రం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ జీజీహెచ్‌ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు.  

పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం 
బాణసంచా పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 20 మంది కుటుంబాలను రాష్ట్ర మంత్రులు అనిత, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్‌ ఆదివారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున ఆరి్థక సాయం చెక్కులు అందజేశారు. బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అనుమతించిన పరిమా­ణం కంటే ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం, కార్మిక శాఖలో నమోదు చేసిన వారి కంటే ఎక్కువ మందిని పనిలో పెట్టడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. 

ఇప్పటికే నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్లు కట్టించడంతో పాటు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement