ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు
నల్గొండ జిల్లా: ప్రేమ విఫలమైందని ఒకరు.. స్నేహం కోసం మరొకరు.. ఇద్దరు యువకులు కలిసి ఒకేచోట మద్యంలో గడ్డిమందు (గ్లైఫోసెట్) కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం శాలిలింగోటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోడె పవన్, కోనేటి అఖిల్లిద్దరూ క్లాస్మేట్స్తోపాటు ప్రాణ స్నేహితులు కూడా. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. నల్లగొండలో ఐటీఐ కూడా కలిసే చదివారు.
ఈ క్రమంలోనే పవన్ కట్టంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పవన్, ఆ బాలిక పది రోజుల కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కట్టంగూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విషయాన్ని పవన్ కుటుంబీకులకు తెలియజేయగా.. అడ్రస్ తెలుసుకొని పవన్ను, ఆ బాలికను రప్పించారు. ఆపై బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
దీంతో ప్రేమ విఫలమైందని పవన్ కుమిలిపోతున్నాడు. ఇద్దరూ కలిసి..: పవన్, అఖిల్ రోజు మాదిరిగానే బుధవారం కలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. గడ్డిమందు, మద్యం, కూల్డ్రింక్ కొనుగోలు చేసి వాటిని తీసుకొని పవన్ కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. మద్యంలో గడ్డిమందు కలుపుకొని తాగారు. ఆ తర్వాత తమ సన్నిహితులకు ఫోన్ ద్వారా జరిగిన విషయాన్ని చెప్పారు. వారు వచ్చేసరికి ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.


