ప్రతీకాత్మక చిత్రం
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాకరకాయ కూర వండటంపై తలెత్తిన వివాదం ఓ తల్లి ప్రాణాలను తీసింది. చంద్రపూర్లోని మూల్ తహసీల్ పరిధిలోని డోంగర్గావ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. మృతురాలిని సుమిత్ర పెట్కులే (65)గా గుర్తించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ర పెట్కులే కుమారుడు జగదీష్ పెట్కులే (37) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి ప్రవర్తన నచ్చక భార్య రెండు నెలల క్రితమే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుండి నిందితుడు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఘటన జరిగిన రోజు రాత్రి జగదీష్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు.
అయితే తనకు నచ్చని కాకరకాయ వండటం గురించి అతడు తన తల్లితో గొడవకు దిగాడు. అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో సహనం కోల్పోయిన జగదీష్.. తల్లిని విచక్షణారహితంగా కాళ్లతో తన్ని, పిడిగుద్దులు గుద్దాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సుమిత్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఈ సంఘటన తర్వాత నిందితుడు ఏ మాత్రం భయం లేకుండా తన తల్లిని చంపానని గట్టిగా కేకలు వేస్తూ గ్రామంలో తిరిగాడు. అయితే అతడు మద్యం మత్తులో ఉండడంతో గ్రామస్తులు పట్టించుకోలేదు. తరువాత వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కాకరకాయ వంటకం విషయంలో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని ముల్ ఇన్స్పెక్టర్ విజయ్ రాథోడ్ స్పష్టం చేశారు.


