కార్తికేయుని సన్నిధిలో మంత్రి కొల్లు రవీంద్ర
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర శనివారం ఉదయం దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.హరనాథ్, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు, కూటమి నాయకులు రావి రత్నగిరి, నడకుదుటి జనార్దనరావు, చందన రంగారావు, మోటుపల్లి పండు, చల్లపల్లి సీఐ ఈశ్వరావు, ఎస్ఐ పి.గౌతమ్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: బాలికను లైంగికంగా వేధించిన నిందితుడికి జైలు శిక్ష పడిందని సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం ఈ కేసు వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం మేరకు.. 2021 సంవత్సరంలో వణుకూరు గ్రామంలో 11 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కలపాల స్వామియేలు ఆమెను తాగడానికి నీళ్లు అడిగి, ఆమెను తాకి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 17వ తేదీ 2021 సంవత్సరంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అప్పటి ఎస్ఐ వెంకటేష్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో ఎనిమిది మంది సాక్షలను విచారించిన న్యాయమూర్తి వేల్పుల భవాని ఈ నెల 20వ తేదీన తుది తీర్పు ఇచ్చారు. నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరి మానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది గడ్డం రాజేశ్వరరావు వాదించారు.
గుడివాడరూరల్: గుడివాడ మునిసిపాల్టీలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిని స్ట్రేషన్ అధికారి సీహెచ్ నాగనరసింహారావు శనివారం పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డులో జరుగుతున్న లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ప్రాసెసింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, పట్టణంలోని డ్రెయిన్ల వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. పట్టణానికి సరఫరా అవుతున్న మంచినీరు, ఉత్పత్తి అవుతున్న మురుగునీటి పరిమాణాలను పరిశీలించి అందులో ఎంత మేరకు మళ్లించబడుతుందనే అంశాలను సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి మల వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తరలించి శుద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని పట్టణంలోని పార్కులు, డివైడర్లు నిర్వహణ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన పనులను పూర్తి చేసి ట్రయల్ రన్కు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, డెప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, శానీ టరీ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోనేరుసెంటర్(మచిలీ పట్నం): లోన్ యాప్కు ఓ యువకుడు బలయ్యాడు. ఈ ఘటన మచిలీపట్నంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిలీ పట్నం కాసానిగూడెం ప్రాంతానికి చెందిన ఈడే గిరీష్ కుమార్ (28) నిమ్మకూరు బెల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతని తండ్రి మృతి చెందడంతో కుటుంబ పోషణ బాధ్యత గిరీష్పై పడింది. దీంతో ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్లో రూ.70 వేల రుణం తీసుకుని నెలనెలా బాకీ వాయిదాలను చెల్లిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తటంతో నగదు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. లోన్ డబ్బులు చెల్లించటంలో ఆలస్యం అవుతుండటంతో లోన్ యాప్ సిబ్బంది గిరీష్ను వేధించటం మొదలుపెట్టారు. సిబ్బంది పెడుతున్న ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేని యువకుడు శుక్రవారం రాత్రి పొటాష్ గడ్డ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపుల వల్ల యువ కుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కార్తికేయుని సన్నిధిలో మంత్రి కొల్లు రవీంద్ర
కార్తికేయుని సన్నిధిలో మంత్రి కొల్లు రవీంద్ర


