రేపటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయని కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి (డీఐఈఓ), పరీక్షల కన్వీనర్ ఎస్.సరళ కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పరీక్షలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 24,173 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 25,406 మంది ఉన్నారని వివరించారు. జిల్లాను 14 జోన్లుగా విభజించి 63 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 63 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 63 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1,100 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారని పేర్కొ న్నారు. అదనంగా నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, ప్రశ్న పత్రాను భద్రపరిచేందుకు 18 స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. విద్యార్థులు తప్పని సరిగా తమ వెంట హాల్ టికెట్లను తీసుకోవాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144, 163 సెక్షన్లు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


