కుంభాభిషేకానికి ఏర్పాట్లు ప్రారంభం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే కుంభాభిషేక మహోత్సవా నికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ శిఖరం చుట్టూ పరంజా, సెంట్రింగ్ బల్లల ఏర్పాటు పనులను శనివారం ప్రారంభించగా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ వాటిని పరిశీలించారు. దుర్గ గుడిలో మూడు రోజుల పాటు కుంభాభిషేకం జరగనుంది. ఇందు కోసం అమ్మవారి ఆలయ బంగారు శిఖరానికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో చివరి రోజైన మార్చి ఎనిమిదో తేదీన అభిషేకాలు జరుగుతాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుతో పాటు శృంగేరీ శారదాపీఠం పీఠాధిపతులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం చుట్టూ ఐరన్ పైపులు, చెక్కలతో పరంజాను నిర్మిస్తున్నారు. అమ్మ వారి బంగారు శిఖరంపైకి కేవలం ప్రొటోకాల్ ఉన్న వారికే అనుమతించే అవకాశం ఉంది. తిరుపతికి చెందిన కాంట్రాక్టర్కు ఈ పనులను అప్పగించారు. 20 మంది కార్మికులు ఈ పనులను చేపట్టారు. పరంజా నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగించినవి తీసుకువస్తున్నట్లు ఆలయ ఇంజినీరింగ్ అధికా రులు తెలిపారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ తొలుత అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పరంజా పనులను పరిశీలించారు. ఆలయ ఈఓ శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్ శర్మతో పాటు ఆర్అండ్బీ అధికారులు, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లను కట్టు దిట్టంగా నిర్వహించాలని, పనులను ఎప్పటికప్పుడు ఆర్అండ్ బీ అధికారులు పరిశీలించి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. పరంజా నిర్మాణ పనులు నెలాఖరు నాటికి పూర్తి చేసి క్వాలిటీ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. కుంభాభిషేకం ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందుగా సీఎంఓ కార్యాలయం తనిఖీలు, భద్రతా తనిఖీలు జరుగుతాయని తెలుస్తోంది.


