నేడు ఆర్గానిక్ రైతోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో శనివారం ఎన్టీఆర్ జిల్లా సేంద్రియ మేళా – ఆర్గానిక్ రైతోత్సవం జరగనుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అన్నదాతలు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్గానిక్ రైతోత్సవం నిర్వహణపై జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి రెవెన్యూ, ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్ధక తదితర సమన్వయ శాఖల అధికారులతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సామర్థ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ స్టాళ్లు కూడా ఉంటాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన ఉత్పాదితాల ప్రదర్శన ఉంటుందన్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమధనానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. ప్రకృతి వ్యవసాయ రైతులు, వినియోగదారులు, సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలోనూ ప్రకృతి వ్యవసాయ మేళా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లభించేలా మార్కెటింగ్ లింకేజీ, ఎంఓయూలపై అవగాహనతో పాటు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, మంచి ఫలితాలు వచ్చేలా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.


