హృదయ కల్లోలం
హృదయ కల్లోలం ● లబ్బీపేట(విజయవాడతూర్పు): యువతలో గుండెపోటు ఇటీవల ఆందోళనకరంగా మారుతోంది. ఒకప్పుడు 50 ఏళ్ల వారు గుండెపోటుబారిన పడితే.. ప్రస్తుతం 30 ఏళ్లలోపు వారే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ఈ సమస్యతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్న మధ్య వయస్సు వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.
కోవిడ్ తర్వాత అధికం
కోవిడ్ తర్వాత యువతలో గుండె సమస్యలు అధికమయ్యాయి. వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారు. గుండె సమస్యలు తలెత్తడానికి విపరీతమైన ఒత్తిళ్లు(స్ట్రెస్), స్మోకింగ్, ఆల్కాహాల్, గుట్కాలు తినడం ప్రధాన కారణాలు కాగా, ఎయిర్ పొల్యూషన్, ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతున్నాయి. యువతలో గుండెపోటును నివారించాలంటే చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన అలవాట్లు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఆకస్మిక మరణాలకు కారణాలివే
గుండె రక్తనాళాల్లో క్లాట్స్(పూడికలు) ఏర్పడటం, ఎలక్ట్రికల్ ప్రాబ్లెమ్స్, గుండె పెరగడం వంటి మూడు కారణాలతోనే ఎక్కువగా యువత గుండె పోటుతో ఆకస్మికంగా మరణిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
ఏం చేయాలంటే..
ఒకప్పుడు గుండె స్క్రీనింగ్ పరీక్షలు 40 ఏళ్లు దాటిన వారు రెగ్యూలర్గా చేయించుకునే వారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
● ధూమపానం, గుట్కాలు తీసుకునేవారి రక్తనాళాల్లో క్లాట్స్ రావచ్చు. వీరు గుండె పరీక్షలు చేయించుకోవాలి.
● ఆల్కాహాల్ సేవించే వారిలోనూ గుండె సమస్యలు రావచ్చు.
● వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్న వారికి చిన్న వయసులో సమస్యలు రావచ్చు.
● ఆహార అలవాట్లు, ఒబెసిటీ కారణంగా క్లాట్స్ రావచ్చు. ఇలాంటి వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
ముందస్తు పరీక్షలు మేలు
● గుండె జబ్బుల బారిన పడకుండా జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంది.
● పని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. యోగా, ధ్యానం వంటి వాటిపై దృష్టి సారించాలి.
● రోజుకు కనీసం 45 నిమిషాలు వాకింగ్, వ్యాయామం చేయాలి.
● ఆరోగ్యకమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్, నూనె పదార్థాలు తీసుకోకూడదు.
యువతలో గుండె సంబంధిత వ్యాధులు విపరీతమైన ఒత్తిడి కారణమంటున్న వైద్యులు స్మోకింగ్, ఆల్కాహాల్, గుట్కాలతోనూ సమస్యలు
ప్రధానంగా..
చిట్టినగర్లోని వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీ వయస్సు 32. ఇటీవల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో పదిహేను రోజుల క్రితం ఆకస్మికంగా విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు.
మంగళగిరి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వైద్యుడి వయస్సు 29. వైభవంగా పెళ్లి జరిగిన పదిరోజులకే ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు.
ఇలా వీరిద్దరే కాదు. ఇటీవల కాలంలో తరగతి గదిలో కుప్పకూలి మరణించిన విద్యార్థిని, బస్సు కోసం వేచి చూస్తూ ఆకస్మికంగా గుండెపోటుతో బస్టాండులోనే మరణించిన ప్రయాణికుడు వంటి ఘటనలు ఇటీవల అనేకం చూస్తున్నాం.
1/1
హృదయ కల్లోలం