రోగులకు నాణ్యమైన సేవలు అందాల్సిందే
విజయవాడ కొత్త జీజీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాజీ ఉండకూడదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. విజయవాడలోని కొత్త జీజీహెచ్ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, శుభ్రత, ఔషధాల లభ్యత, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
రోగులతో మాట్లాడి..
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోగికి సమయానుకూలంగా నాణ్యమైన చికిత్స అందాలని స్పష్టం చేశారు. ఆస్పత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ), ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఔషధ పంపిణీ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బందికి సేవల మెరుగుదలపై సూచనలు ఇచ్చారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు సమర్థంగా అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు కూడా ఉన్నారు.


