గ్రాట్యూటీపై సీలింగ్ రద్దు చేయాలి
మచిలీపట్నంఅర్బన్: వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీపై సీలింగ్ విధించి కేవలం రూ.2లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని, గ్రాట్యూటీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి చెల్లింపులు జరపాలని రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జన్యావుల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో సంఖ్య 36ను వెంటనే అమలు చేయాలని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,400 మంది ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటుండగా, ఇప్పటికే 2,026 సహకార సంఘాలు మూత పడ్డాయని తెలిపారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వైవీవీ మోహన్రావు, అడప శ్రీనివాసరావు, వీరవల్లి వెంకటేశ్వరరావు, రాజులపాటి శ్రీనివాసరావు, హనుమకొండ శ్రీనివాసరావు, మెట్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సహకార ఉద్యోగుల నిరవధిక సమ్మెలో నాయకుల డిమాండ్


