సుబ్బారాయుడి సేవలో ఆర్టీసీ ఎండీ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ బాల సుబ్రహ్మణ్యం ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక తహసీల్దార్ ఎం. హరనాథ్, అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ పి. గౌతమ్కుమార్ పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ విభాగమైన యూరాలజీలో రెండు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఆ విభాగంలో ఇద్దరు పీజీ విద్యార్థులు అడ్మిషన్లు పొందనున్నారు. ఇప్పటికే న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు ఉండగా, తాజాగా మరో విభాగంలో మంజూరయ్యాయి. కాగా 2020లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం అనంతరం యూరాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి అందిస్తున్న నాణ్యమైన సేవలకు గాను, ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేశారు. యూరాలజీ పీజీ సీట్లు వచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ను వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ గోవింద్, డాక్టర్ ప్రభాకర్, ఇతర టీచింగ్ అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గుజరాత్లోని వడోదరలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరగనున్న 72వ సీనియర్ జాతీయ పురుషుల కబడ్డీ చాంపియన్షిప్లో మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టును ఎంపిక చేశామని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.శ్రీకాంత్ ప్రకటనలో ఆది వారం తెలిపారు. ఇండియా అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీకి జట్టు కెప్టెన్గా పి.దుర్గారావు(తూర్పు గోదావరి), పి.గోపి(పల్నాడు), జి.లక్ష్మారెడ్డి(బాపట్ల), ఎన్.తేజ (విశాఖపట్నం), సీహెచ్ నాగబాబు (కాకినాడ), కె.రాంబాబు(తిరుపతి), కె.ఫణేంద్ర(ఎన్టీఆర్), పి.బ్రహ్మారెడ్డి(బాపట్ల), కె.దినేష్ (తిరుపతి), జి.పవన్ కుమార్ (కృష్ణ), కె.హరి ప్రసాద్ రెడ్డి(బాపట్ల), కె.మనోహర్ (కాకినాడ), జి.హరీష్ (పల్నాడు), ఎస్కే బాషా(గుంటూరు), జట్టుకు కోచ్గా టి.సుధాకర్, జట్టు మేనేజర్గా కె.మహేష్లు ఎన్నికయ్యారన్నారు. క్రీడాకరులను రైల్వే శాఖ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అదనపు డైరెక్టర్ కె.రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, జాయింట్ సెక్రటరీ నాంచారయ్య అభినందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): సిపాయిల తిరుగుబాటుకు ముందే ఆంగ్లేయుల పాలనను ఎదురించి పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లోని మీ కోసం హాలులో కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి తెలుగువారి పౌరుషాన్ని చాటి చెప్పిన అమర వీరుడన్నారు. డీటీడబ్ల్యూవో ధూర్జటి ఫణి, డెప్యూటీ కలెక్టర్ నారాయణ పాల్గొన్నారు.
సుబ్బారాయుడి సేవలో ఆర్టీసీ ఎండీ
సుబ్బారాయుడి సేవలో ఆర్టీసీ ఎండీ
సుబ్బారాయుడి సేవలో ఆర్టీసీ ఎండీ


