ఆర్చరీ టోర్నమెంట్ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆర్చరీ క్రీడాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. స్థానిక పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ కళాశాల ఆవరణలో 3వ ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్–2026 ఆదివారం ప్రారంభమైంది. కలెక్టర్ లక్ష్మీశ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ ర్యాంకింగ్ పోటీలకు విజయవాడ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
24వరకూ పోటీలు..
ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ 3వ ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఫర్ ఉమెన్ ఆర్చరీ టోర్నమెంట్ ఈ నెల 24వ తేదీ మంగళవారం వరకు జరుగుతుందన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్), డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. సబ్–జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో రికర్వ్ అండ్ కాంపౌండ్ అంశాల్లో టోర్నమెంట్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ టోర్నమెంట్ కాంపిటేషన్ డైరెక్టర్ అరుంధతి సిలో, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీవీ రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


