‘వికసిత్ భారత్’లో యువత భాగస్వాములు కావాలి
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆత్కూరు(గన్నవరం): వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆదివారం జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా యువత తమ కాళ్ల మీద తాము నిలబడి నైపుణ్య శిక్షణ ద్వారా స్వావ లంబన సాధించాలని సూచించారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడి తద్వారా సుస్ధిర దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ట్రస్టీ అట్లూరి అశోక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరదేశి, సీఈఓ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు.
హోమియో వైద్య శిబిరం పరిశీలన..
అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్లోని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జీవీ చలపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించారు. డాక్టర్ పి.వి.సత్యనారాయణ బృందం ఎటువంటి లాభపేక్ష లేకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ముదాహమని ఆయన పేర్కొన్నారు.


