సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం నెమలి శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో వివాదం చోటుచేసుకుంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయితీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోని పట్టు వస్త్రాలను కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు కంగుతిన్నారు. కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ, భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాగా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. మరోవైపు, పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి.. టీడీపీ అధిష్ఠానం వద్ద వాపోయినట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవల కేశినేని చిన్నిపై కొలికపూడి పోస్ట్లు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన మానుకొండ రామకృష్ణ ఫోటోను పెడుతూ ‘బంగారు కొండ.. మానుకొండ’ అంటూ పోస్ట్ పెట్టారు కొలికపూడి.. వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపాయి.



