పెనుగంచిప్రోలు: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద నిర్దేశించిన సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించాలని నీతి అయోగ్ ఢిల్లీ అధికారి రాధిక ములే అన్నారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం మండలంలో పర్యటించారు.అంగన్వాడీ కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పశు వైద్యశాలలు, పెనుగంచిప్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. శనగపాడు గ్రామంలో గ్రామీణ కృషి పరిజ్ఞాన కేంద్రం సందర్శించి అక్కడ రైతులకు అందిస్తున్న స్మార్ట్ అగ్రి కల్చర్ శిక్షణ, జియో ఫెన్సింగ్, వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వివరాలు తెలుసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం వంటి సూచికల్లో పూర్తి స్థాయిలో వృద్ధి సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మార్గదర్శకంలో సంపూర్ణత అభియాన్ 2.0 జిల్లాలో సమర్ధవంతంగా అమలవుతూ మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, ఎంపీడీఓ జి శ్రీను, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మీ, ఏఓ రామసుబ్బారెడ్డి, ఎంఈఓ రవీంద్ర, వైద్యాధికారి నాగరాణి, పశువైద్యాధికారి పి.అనిల్, ఏబీపీ కో–ఆర్డినేటర్ మోహన్ సందీప్, ఏపీఎం వెంకటరమణ, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ నాంచారయ్య, హౌసింగ్ ఏఈ సతీష్, ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి, డెప్యూటీ ఎంపీడీఓ సుబ్బారావు, ఏఓ సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


