నందిగామ రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. మండలంలోని పల్లగిరి గ్రామానికి చెందిన పాల్వాయి నీలాంబరం, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం. తేజ (14), సోదరి తేజశ్రీ, తనూజ్ ముగ్గురు పిల్లల్లో తేజ, తేజశ్రీలు కవలలు. నీలాంబరం తాపీమేసీ్త్రగా పని చేస్తుండగా భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలోని పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న తేజ శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తరువాత తాత జేమ్స్తో కలిసి రాఘవాపురం శివారులోని మామిడి మొక్కలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తాత తోటలో నీళ్లు పెడుతుండగా తేజ బుంగతో బావిలో నీటిని తీసుకొచ్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడ్డాడు. గమనించిన తాత బావిలోకి దూకి గాలించినప్పటికీ బాలుడు లభ్యమవకపోవటంతో కేకలు వేశాడు. చుట్టపక్కల వారు అక్కడకు చేరుకుని అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బావిలోని నీటిని తోడి బాలుడిని బయటకు తీసినప్పటికీ అప్పటికే మృతి చెందాడు.


