అకాల వర్షం.. పంటలకు నష్టం
తిరువూరు/గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాలవర్షానికి వాణిజ్య పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. తిరువూరు మండలంలో 8.2 మిల్లీ మీటర్లు, గంపలగూడెంలో 3.4, విస్సన్న పేటలో 2.6, ఎ.కొండూరులో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో ఐదు వేల ఎకరాల్లో మిర్చిపంట సాగు చేయగా, మొదటి కోతను కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటిపాలైందని తునికిపాడు, దుందిరాలపాడు, ఊటుకూరు, నెమలి, రాజవరం, కొణిజర్ల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ఇస్తున్న ప్రోత్సాహంతో గంపలగూడెం మండలంలో 8వేల ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్న రైతులు కూడా అకాలవర్షం కారణంగా నష్టపోయామని వాపోతున్నారు. 70 శాతం పంట వర్షం కారణంగా పాడవడంతో ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేలవాలిన మొక్కజొన్న
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఎ.కొండూరు మండలంలో మొక్కజొన్న నేల వాలింది. మండలంలోని వల్లంపట్ల, పోలిశెట్టిపాడు, గొల్ల మందల, మాధవరం, రేపూడి తదితర గ్రామాల్లో 250 ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. తిరువూరు మండలంలోని ఎర్రమాడు, కొమ్మిరెడ్డిపల్లి, రాజుగూడెం గ్రామాల్లో మిర్చి పంటకు పాక్షికంగా నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అకాల వర్షం కారణంగా కలిగిన పంటనష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
గంపలగూడెం మండలం ఊటుకూరులో
నేలకొరిగిన మొక్కజొన్న పంట
వర్షంతో తడిసిన మిర్చి
మిర్చి, మొక్కజొన్న రైతుల దిగాలు
పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు
చేతికందే దశలో వాణిజ్య పంటలు నేలపాలు
అకాల వర్షం.. పంటలకు నష్టం


