శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకం
● మార్చి 6వ తేదీ నుంచి
మూడు రోజుల పాటు నిర్వహణ
● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శక్తి పునరుద్ధరణ కోసం మహా కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి ఆరో తేదీన ప్రారంభమయ్యే ఈ మహోత్సవ ఏర్పాట్లను కలెక్టర్, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈఓ శీనానాయక్, జిల్లా అధికార యంత్రాంగం, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులతో కలిసి మీడియా సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. 12 ఏళ్లకు ఒక సారి మహా కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. చివరి సారిగా 2014 ఫిబ్రవరిలో ఈ వేడుక జరిగిందన్నారు. మార్చి ఆరో తేదీ ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదగా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.45 గంటలకు కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కంచి కామకోటి పీఠాధిపతి చేతుల మీదగా కుంభాభిషేకం జరుగుతుందన్నారు. ఉత్స వంలో సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపారు. మహా కుంభాభిషేకంలో ఆలయ బంగారు గోపుర సంప్రోక్షణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో వేద పండితులు క్రతువులు నిర్వహిస్తారన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవా లకు మూడు లక్షల మంది భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందన్నారు.
చైర్మన్ చాంబర్లో సమీక్ష
కుంభాభిషేకం ఏర్పాట్లపై జిల్లా అధికారులు, దుర్గగుడి అధికారులు చైర్మన్ చాంబర్లో సమీక్ష జరిపారు. గతంలో నిర్వహించిన కుంభాభిషేకం విశేషాలను ఆలయ వైదిక కమిటీ సభ్యులు కలెక్టర్కు వివరించారు. ఆలయ వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, ఎల్.దుర్గాప్రసాద్, ఎం.షణ్ముఖేశశాస్త్రి, వి.శ్రీధర్, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


