పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజ్ రద్దు చేయాల్సిందే
ఫోరం ఫర్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వారడిసన్ క్లాస్ పెన్షన్ వ్యాలిడేషన్ క్లాజును వెంటనే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రామమోహన గ్రంథాలయంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో పార్లమెంటులో ఆర్థికబిల్లులో భాగంగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ వ్యాలిడిషన్ క్లాజ్ చేర్చి ఆమోదించిందన్నారు. ఈ క్లాజ్ పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడగొట్టిందన్నారు. భవిష్యత్తులో వేతన సవరణ జరిగితే పాత పెన్షనర్స్కు పెన్షన్ సవరణ లేకుండా.. కొత్త పెన్షనర్స్కు మాత్రమే సవరణ పొందే హక్కులు కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం పొందించిందన్నారు. ఇది పెన్షనర్లకు హక్కులను కాలరాసే చర్య అని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎరియర్స్ సహా అమలు చేయండి..
ఫోరం అధ్యక్షుడు వి.వరప్రసాద్ మాట్లాడుతూ 8వ సెంట్రల్ పే కమిషన్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ప్రస్తుతం సివిల్ పెన్షనర్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్తో సహా అందరికీ పెన్షన్ సరవణ ఉండే విధంగా చూడాలన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేతన సవరణ, ఎరియర్స్ సహా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం కన్వీనర్ ఎన్. రామారావు, ఏఐబీడీపీఏ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్ బాబు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కేఎస్సీ బోస్, ఏఐబీఎస్ఎన్ఎల్ పీడబ్ల్యూఏ నాయకులు పాల్గొన్నారు.


