ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘మీ కోసం’ నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ‘మీ కోసం’లో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ బాధితుల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించే దిశగా అధికారులు పనిచేస్తున్నారన్నారు. మీ కోసంలో ఎలాంటి ఫిర్యాదునైనా అధికారుల దృష్టిలో పెట్టవచ్చని చెప్పారు. వాటిని చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ‘సమస్య మీది పరిష్కారం మాది’ అనే నినాదంతో సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. సోమవారం జరిగిన ‘మీ కోసం’లో 48 అర్జీలు అందుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆటోనగర్(విజయవాడతూర్పు): భారతీనగర్ సర్వీస్ (తూర్పువైపు) రోడ్డులో ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్ర పక్కన జిరాక్స్షాపు తెరచి ఉంచారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రం సమీపంలో ఇలాంటివి తెరిచి ఉండకూడదు. పరీక్ష జరిగే సమయంలో తప్పనిసరిగా మూయించాల్సి ఉంది. అయితే అధికారులు, పోలీసులు అలాంటి చర్యలేమి తీసుకోలేదు. దీనిని పలువురు తప్పుబడుతున్నారు.
రామవరప్పాడు: అతి ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్ అధిరోహణకు విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు జెడ్పీ పాఠశాల దివ్యాంగ విద్యార్థి గట్టెం విశ్వాస్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సోమవారం విశ్వాస్ను పాఠశాల హెచ్ఎం తాయారు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా తాయారు మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణే లక్ష్యంగా జాతీయ స్థాయి హై ఆల్టిట్యూడ్ శిక్షణకు విశ్వాస్ ఎంపికై నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎంపికై , కడప జిల్లా గండికోటలో నెల రోజుల పాటు శిక్షణను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని లడక్లో ట్రైనింగ్కు ఎంపికై నట్లు వివరించారు. శారీరక లోపం ఉన్నా ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో ఇంతటి ఘనత ను సాధించడం అభినందనీయమన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఆ సినిమాకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్ర చేపట్టినట్లు హీరో శివ కందుకూరి తెలిపారు. బెంజిసర్కిల్లోని ట్రెండ్సెట్మాల్లో ప్రేక్షకులతో కలిసి హీరో శివ కందుకూరి, హీరోయిన్ తేజు అశ్విని, దర్శకుడు ప్రమోద్ హర్ష చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రేక్షకులను నేరుగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శివ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉన్న చిత్రాన్ని తప్పనిసరిగా ఆదరిస్తారనడానికి తమ చిత్రమే నిదర్శనం అన్నారు. అనంతరం హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ తాను విజయవాడ వాసినే అని, ఇక్కడి ప్రేక్షకులను నేరుగా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర బడ్జెట్లో బీసీ కార్పొరేషన్లకు జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని పటమటలో సోమవారం కుల సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారేష్ మాట్లాడుతూ బీసీలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేయాలని కోరారు. సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్లపై రివ్యూ నిర్వహించి ఇంకా వెల్లడించని కులాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆదరణ పథకాన్ని ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్లకు బడ్జెట్ పెంచాలన్నారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్ నూటికి నూరు శాతం బీసీలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం


