కళాకారులను ప్రోత్సహించాలి
విజయవాడ కల్చరల్: కళాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. సమతా సేవా సమితి, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన జీవీఆర్ సంగీత కళాశాలలో చింతా కృష్ణమూర్తి 42వ వర్ధంతి, సమతాసేవా సమితి 15వ వార్షిక వేడుకలు, వివిధ రంగాలకు చెందిన వారికి పురస్కారాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ సాంస్కృతిక కళాసంస్థలు, కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా సమతా సేవా సమితి సేవలను వివరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి మహ్మద్ ఇంతియాజ్, జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, కోగంటి సత్యం, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ వెన్నా వల్లభరావు పాల్గొన్నారు. సమతాసేవా సమితి నిర్వాహకుడు చింతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రంగస్థల కళాకారుడు దంగేటి సూర్యప్రకాశరావుకు రంగస్థల యశస్వి, గొలిమి రామకృష్ణకు ఉద్యోగ రత్న, పురస్కాలను అందజేశారు. చింతా కృష్ణమూర్తి స్మారక పురస్కారాన్ని మాదాల గోపాల కృష్ణకు ప్రదానం చేశారు.


