మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మైలవరం/రెడ్డిగూడెం: మామిడి పంట తెగుళ్లు బారిన పడి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డిగూడెం, మైలవరం మండలాల్లోని మామిడి తోటలను ఆదివారం రైతు సంఘం నాయకులు, రైతులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అమర్ భవన్లో ఎం.మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మైలవరం, తిరువూరు ఎమ్మెల్యేలు నష్టపోతున్న మామిడి రైతుల గురించి చర్చించాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేలకు పైగా ఎకరాల్లో మామిడి పంట సాగు చేస్తున్న రైతులు పండించిన పంటకు నల్లదోమ, పేలు బారిన పడి పూర్తిగా మామిడి దెబ్బతినడం జరిగిందన్నారు. పంట నాణ్యత లేక దిగుబడి రాకపోవడంతో రైతులు మామిడి చెట్లను నరికేస్తున్నారని తెలిపారు. లక్షల రూపాయాలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, పీవీ ఆంజనేయులు, జిల్లా నాయకులు వీరారెడ్డి, ధనలక్ష్మి, వి.వెంకటరెడ్డి, రావుల సుబ్బారావు, అప్పిరెడ్డి, కొండపల్లి పరమేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.


