ఎలుకలు దాడి చేస్తున్నా పట్టని పాలకులు..
ఏకొండూరులోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల ద్వితీయార్థంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలను ఎలుకలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. సుమారు పదకొండు మంది బాలికలు ఎలుకల దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రభుత్వం హాస్టల్స్ నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యానికి ఇదొక మచ్చుతునక. ఈ సంఘటనతో సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆ ప్రాంగణాన్ని సందర్శించి పరిశీలించారు. ఒకటిరెండు చర్యలు చేపట్టినా సమూల మార్పు తీసుకురావటానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవే పరిస్థితులు చాలా హాస్టళ్లలో కనిపిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


