విద్యుత్ అదాలత్కు 12 అర్జీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారుల అదాలత్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టౌన్ ఈఈ రవీంద్రబాబు తెలిపారు. మంగళవారం విజయవాడ ఏపీసీపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హలు నందు సీజీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ డివిజన్కు సంబంధించిన 16 సెక్షన్లకు సంబంధించి అదాలత్లో మొత్తం 12 మంది వినియోగదారులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. వీటిలో స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వేలాడే విద్యుత్ తీగలు సరిచేయాలని, లైన్ షిఫ్టింగ్ వంటి పలు అంశాలపై వినియోగదారులు అదాలత్లో ఫిర్యాదు చేశారన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్. విక్టర్ ఇమ్మానుయేలు అధ్యక్షతన జరిగిన అదాలత్లో సాంకేతిక సభ్యుడు డి. కృష్ణానాయక్, ఆర్థిక సభ్యుడు కె. కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ. సునీత, ఎస్ఈ యు. హనుమయ్య పాల్గొని అర్జీలను స్వీకరించారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక మధుచౌక్లోని మొగల్ ఎగ్జిబిషన్ హాలులో ఈ నెల 28 శనివారం నుంచి మార్చి 8వ తేదీ వరకు మహిళా ఉత్సవ్–2026ను నిర్వహిస్తున్నామని జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు వారే స్వయంగా విక్రయించేందుకు ఏటా ఈ మహిళా ఉత్సవ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 28వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్, డీఆర్డీఏ ఎన్టీఆర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వీ నాంచారయ్య, జన శిక్షణ సంస్థాన్ వైస్ చైర్పర్సన్ గోళ్ల వాణీ హాజరై మహిళా ఉత్సవ్ను ప్రారంభిస్తారని చెప్పారు.


