ప్రత్యేక కార్పొరేషన్ కోరుతూ అర్ధ నగ్న ప్రదర్శన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్టీ వర్గీకరణ చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. యానాద రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరాయి. కార్యక్రమానికి కేవీపీఎస్, గిరిజన సంఘాలు, మద్దతు తెలిపాయి. మద్దతు తెలిపిన వారిలో ఆండ్ర మాల్యాద్రి, లోకనాథం, ఈగ శ్రీనివాసరావు, పి. లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి యానాదుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ ప్రదర్శనలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసరావు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


