ఇజ్రాయెల్లోని ఒక బంకర్లో స్థానిక ప్రజలతో కలిసి తలదాచుకున్న తెలంగాణ కార్మికులు
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, కార్మికుల్లో ఆందోళన
ఆర్మూర్ /మోర్తాడ్ (బాల్కొండ)/ కొత్తపల్లి (కరీంనగర్): ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లలో ఉన్న తెలంగాణ వలస కార్మికులు, విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్లో బాంబుల దాడులు సాధారణమే కానీ ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉందని వలస కార్మికులు వెల్లడించారు. కాగా, యూఏఈ, ఖతర్, ఇతర గల్ఫ్ దేశాల్లో మాత్రం చాలా కాలం తరువాత తొలిసారి దాడులు జరుగుతుండటంతో వలస కార్మికులు తమ ప్రాణాలకు, ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేయగా, ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, యూఏఈలలో తెలంగాణ వలస కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. టామ్కామ్తో పాటు ప్రైవేటు ఎజెన్సీల ద్వారా అనేక మంది వలస కార్మికులు ఇజ్రాయెల్కు వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో వలస కార్మికులు బంకర్లకు చేరుకున్నారని ఇజ్రాయెల్లోని పలువురు తెలంగాణ వాసులు వెల్లడించారు. కాగా, బహ్రెయిన్లో సురక్షిత ప్రాంతాల జాబితాను అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
జుబేర్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ స్థావరాలపై శనివారం ఇరాన్ బాంబుల దాడి చేయడంతో పౌర నివాసాలపై కూడా ఆ ప్రభావం కనిపించింది. అక్కడి ప్రజలతో పాటు తెలంగాణ వలస కార్మికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులెత్తారు. ఖతర్, యూఏఈ, కువైట్లలోను భారత విదేశాంగ శాఖ వలస కార్మికుల రక్షణకు సూచనలు చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో ఉన్న తమ వారిని రక్షించాలని కార్మికుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
భయం భయంగా దుబాయ్లో
యుద్ధం నేపథ్యంలో దుబాయ్లోని తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దుబాయ్, అబుదాబి, కువైట్, బహ్రెయిన్, ఖతార్లపై క్షిపణి దాడులు జరుగుతున్నట్లు వార్తలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుబాయ్లో ఉన్న తెలుగువారిని వాకబు చేస్తూ తమ పిల్లల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇంజనీరింగ్ చదివేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్కు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు పరిస్థితులు బాగానే ఉండగా సాయంత్రం నుంచి కొంత ఆందోళనకరంగా మారిందని చెపుతున్నారు. కాగా, యుద్ధ ప్రాంతాల్లోని భారతీయులను రక్షించేందుకు తగిన చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.


