2022 ఆగస్టు నుంచి నిలిచిపోయిన నూతన పెన్షన్ల మంజూరు
కొత్త పింఛన్ల కోసం పేదల ఎదురుచూపులు
ఇప్పటికే వీటి కోసం అందిన 19 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ‘చేయూత’పింఛన్ల మంజూరు కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేయకపోవడంతో వీటిని కోరుకుంటున్న పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త పింఛన్ల దరఖాస్తునకు సంబంధించి 2022 ఆగస్టు నుంచే ఆసరా పింఛన్ల ఆన్లైన్ పోర్టల్ అందుబాటులో లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లుగా వివిధ కేటగిరీల కింద కొత్త పింఛన్ల కోసం దాదాపు 19 లక్షల దాకా ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి.
దాదాపు మూడున్నరేళ్లుగా కొత్త పింఛన్ల కోసం వివిధ కేటగిరీల వారు నిరీక్షిస్తున్నారు. వీటిలో అత్యధికంగా అంటే దాదాపు 12 లక్షల దాకా వృద్ధాప్య, నాలుగు లక్షల దాకా వితంతు, మూడులక్షల దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే 70 వేలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న దరఖాస్తులన్నీ కలిపితే 19 లక్షలు ఉన్నట్టుగా సమాచారం.
చేయూత ఇలా...
చేయూత పథకం... వృద్ధులతోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కారి్మకులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ పేషెంట్లకు భరోసానిస్తోంది. ఉమ్మడి ఏపీలో 2004–14 మధ్య పదేళ్ల కాలంలో పింఛన్ల కోసం రూ.5,558 కోట్లు ఖర్చుచేయగా... తెలంగాణ ఏర్పడ్డాక... 2014–23 ఏళ్ల మధ్య ఆసరా పథకం కింద రూ.61,526 కోట్లు వ్యయం చేశారు. ప్రస్తుతం వృద్ధాప్య ఇతర కేటగిరీల పింఛనుదారులకు నెలకు రూ.2,016 చెల్లిస్తుండగా, దివ్యాంగులకు రూ.4,016 అందజేస్తున్నారు.
2014 వరకు పింఛన్లు పొందే లబ్ధిదారులు 29,21,828 మంది ఉన్నారు. 2023 డిసెంబర్ నాటికి వివిధ కేటగిరీల ఆసరా పింఛ¯న్దారుల సంఖ్య 43,20,551కు పెరిగింది. వివిధ కేటగిరీల కింద పింఛన్ పొందే వారి మరణాలు, అనర్హతలు, ఇతర కారణాల వల్ల 3.05 లక్షల పింఛన్లను తొలగించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని కేటగిరీల కింద పింఛన్ పొందుతున్న వారు 41,02,818 ఉన్నట్టుగా తెలుస్తోంది.


