నిజమాబాద్ జిల్లా: లండన్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు తెలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న దక్షిణ లండన్లోని క్రోయ్డన్ప్రాంతంలో ఉన్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం అంతా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఈ ఘటనలో పెద్దాపురం (కాకినాడ జిల్లా)కు చెందిన గంటి అభిషేక్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. నిజమాబాద్ జిల్లాకు చెందిన సాయి శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీకర్ను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ శుక్రవారం మృతి చెందాడు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ముగ్గురు యువకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్కు వెళ్లి, చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినట్లు తెలిసింది. క్రోయ్డన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకర్ మృతితో నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


