లండన్: ఇంగ్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన అభిషేక్, ఉన్నత విద్య కోసం 2023లో లండన్కి వెళ్లాడు. ఎంబీఏ పూర్తి చేసి అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం పొందాడు.
ఈ క్రమంలో దక్షిణ లండన్లోని క్రోయ్డన్ ప్రాంతంలో ఆయన నివసిస్తున్న ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మరో ఇద్దరు బయటకు తప్పించుకోగలిగారు. అయితే, అభిషేక్ మాత్రం బయటకు రాలేకపోయాడు. కమ్ముకున్న పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఈ అగ్నిప్రమాదంలో రెండు అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. కిటికీలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఒకరు ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
భిషేక్ మృతి వార్త స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పెద్దాపురం ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో ప్రతిభావంతుడైన అభిషేక్, ఎంబీఏ పూర్తి చేసి మంచి కెరీర్ అవకాశాలు పొందాలని కలలు కనేవాడు. కానీ ఈ అగ్నిప్రమాదం ఆ కలలను మధ్యలోనే చిదిమేసింది.


