విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి దుర్మార్గమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మండిపడ్డారు. అంబటి అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు.. హైకోర్టు డైరెక్షన్స్ పాటించలేదంటూ ధ్వజమెత్తారు.
మూడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లలో ప్రొసీజర్ ఫాలో కాలేదని విమర్శించారు. అసలు దాడికి పాల్పడిన వారికి స్టేషన్బెయిల్ ఎలా ఇస్తారని పొన్నవోలు ప్రశ్నించారు. దాడికి సహకరించిన పోలీసుల వీడియోలను సేకరిస్తున్నామన్నారు. అంబటి ఇంటిపై దాడి వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని తెలిపారు పొన్నవోలు.
కాగా, గత నెల 31వ తేదీ ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. టీడీపీ మూకలు.. అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. అంబటి ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించిన టీడీపీ గూండాలు.. ఆయనపై కూడా హత్యాయత్నం చేశారు. అంబటి ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.
తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరి వెళ్లిన సమయంలో గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు.

అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు అంబటి . దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. తనపై దాడికి యత్నించే సమయంలో పోలీసులు చోద్యం చూశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇదిలా ఉంచితే, అంబటి రాంబాబును అరెస్ట్కు ముందే రంగం సిద్ధం చేసిన పోలీసులు.. ఎట్టకేలకు రాత్రి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. అంబటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఉద్రిక్తతల నడుమే అంబటిని అరెస్ట్ చేశారు.


