మిల్లుల్లో మళ్లీ తనిఖీలు
కేసులపై ఇప్పటికే మిల్లర్లు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమ కేసు ఆర్థిక నేరం కింద రాదని, ఆ కేసులను కొట్టివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దానిపై జిల్లా పోలీసు అధికారులు కౌంటర్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే గురువారం కేసు విచారణకు రానున్న నేపథ్యంలో ఆలోగా కౌంటర్ దాఖలు చేయనున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆ ఏడు మిల్లుల్లో ధాన్యం నిల్వలపై అధికారులు మళ్లీ తనిఖీలు చేపట్టారు. వేలం వేసిన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లపై ఇప్పటికే కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు అరెస్టు కాగా మిగతా వారు పరారీలో ఉన్నారు. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిన వేలం వేసిన ధాన్యం కాకినాడ పోర్టుకు తరలించారంటూ వచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వం అప్పట్లో తనిఖీలు చేయించింది. అక్కడ ఉండాల్సి ధాన్యం కంటే రూ.191 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉందని అధికారులు తేల్చారు. ఇప్పుడు ఆ మిల్లుల్లో మిగతా ధాన్యం ఉందా? మిల్లర్లు వాటిని కూడా అమ్మేసుకున్నారా? అన్నది తేల్చేందుకు మళ్లీ తనిఖీలు చేపట్టారు.
ఆర్ఆర్ యాక్ట్కు సిద్ధమవుతున్న అధికారులు
ఆ ఏడు మిల్లులపై రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంబంధిత తహసీల్దార్లకు నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఆర్ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లకు పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్ఆర్ యాక్టు అమలు చేయబోతున్నందున మిల్లుల్లో ధాన్యం ఎంత ఉంది..? గతంలో తనిఖీలు చేసినప్పుడు అమ్ముకున్నది పోగా అక్కడ మిగిలి ఉన్న ధాన్యం ఇప్పుడు ఉందా? లేదా? అనేది రీచెక్ చేస్తున్నారు.
ఫ గత తనిఖీల సమయంలో ఉన్న నిల్వలు ఇప్పుడు ఉన్నాయా లేవా అని పరిశీలన
ఫ ఆర్ఆర్ యాక్ట్ కింద కేసుల నమోదుకు రంగం సిద్ధం
ఫ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేసేందుకు పోలీసుల సన్నద్ధం


