సాక్షి,హైదరాబాద్: మధ్య ప్రాచ్య దేశాలపై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని భారత్ ఖండించాలని ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ అన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ఓవైసీ స్పందించారు.
‘ఇరాన్పై దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి గొప్ప నాయకుడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్పై దాడుల్ని తక్షణమే ముగియాలని,ఈ విషయంలో భారత ప్రభుత్వం తన పాత్ర పోషించాలని కోరారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అస్థిరత నెలకొనే అవకాశం ఉంది.
దాడుల్ని కేంద్రం ఖండించాలి. అంతర్జాతీయ స్థాయిలో దేశం శాంతి ప్రయత్నాలకు ముందడుగు వేయాలి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి (10 మిలియన్) మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. యుద్ధం కొనసాగితే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ యుద్ధం కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో కల్లోలం తప్పదు. భారతీయులు అక్కడ చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


