హైదరాబాద్: భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్–సిటీ) ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ముగ్ధ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్పాస్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. పగటిపూట ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా పనులను రాత్రివేళల్లోనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పునాది పనులు పూర్తయ్యే వరకే రహదారిపై కొద్దిపాటి అసౌకర్యం ఉంటుంందన్నారు. ఈ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సజ్జనర్ సూచించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ విజయ్కుమార్, జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ డీసీపీ కాజల్, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తదితరులు సీపీ వెంట ఉన్నారు.


