సాక్షి, హైదరాబాద్: ఆధార్ నంబర్.. యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసే 12 అంకెల ప్రత్యేక సంఖ్య భారతీయ పౌరులకు గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ ఖాతా మొదలు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మొబైల్ సిమ్ కార్డు దాకా అనేక సేవల్లో ఆధార్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆధార్ డేటా భద్రత అత్యంత కీలకంగా మారింది. ఆధార్ వివరాలను నిర్లక్ష్యంగా అపరిచితులతో పంచుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ కార్డును ఎవరికీ ఈ–మెయిల్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఆధార్ నంబర్ను ఉపయోగించి మోసగాళ్లు కొత్త సిమ్లు తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు లేదా ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బాధితులకు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దొంగిలించిన ఆధార్ వివరాలతో కేటుగాళ్లు బాధితుల పేరిట రుణాలు తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అనేక సేవలకు ఆధార్ అనుసంధానమై ఉండటం వల్ల అది లీక్ అయితే వ్యక్తిగత గోప్యతకు పెద్ద ముప్పుగా మారుతుందని.. ఫోన్, ఎస్ఎంఎస్, ఫేక్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసగాళ్లు ఆధార్ వివరాలు దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలా రక్షించుకోవాలి?
⇒ ఆధార్ నంబర్, ఓటీపీ ఎవరితోనూ పంచుకోవద్దు
⇒ అపరిచిత లింక్లలో ఆధార్ వివరాలు నమోదు చేయవద్దు
⇒ అవసరమైతే పూర్తి ఆధార్ బదులుగా మాస్క్డ్ ఆధార్ వినియోగించాలి
⇒ యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్లో ఆధార్ లాక్/అన్లాక్ సదుపాయాన్ని ఉపయోగించాలి
⇒ అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి


