మూడు నెలల్లో 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తాం
మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ కార్డుల జారీకి ముందు వారికి 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వీటి ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించి పంపిణీ చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బంజారాహిల్స్లోని కొమురంభీమ్ ఆదివాసీ భవన్లో జరిగిన కార్యక్రమాలకు ఆయన మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఎస్హెచ్జీ మహిళలకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలను నిర్వహించే కార్యక్రమాన్ని రాజనర్సింహ, సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో శిశువులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీంతోపాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఆన్లైన్ పోర్టల్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమన్నారు. మహిళల ఆరోగ్యం బాగుండాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఎస్హెచ్జీ సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలకు అవకాశం ఇస్తే పంట పొలాల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం ఇప్పుడిప్పుడే సాకారమవుతోందన్నారు.
‘ఇందిరా మహిళా శక్తి అచీవ్మెంట్స్’ పుస్తకాన్ని సీతక్క విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యకార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, దివ్య దేవరాజన్, శ్రుతి ఓజా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. వినూత్న వ్యాపారాలతో రాణిస్తున్న 31 మంది మహిళలను సన్మానించి, వారికి రూ.25వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.


