హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్ ల్లో మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పార్కింగ్ ఫీజు వసూలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ 2021, జూలై 20న జారీ చేసిన జీవో 121పై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.
తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 ప్రకారం వాణిజ్య భవనాల్లో పార్కింగ్ ఉచితం. దీనికి విరుద్ధంగా జీవో 121 జారీ చేశారంటూ న్యాయ విద్యార్థి ప్రేమ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్లో తన నుంచి వసూలు చేసిన పార్కింగ్ ఫీజు రశీదును జత చేశారు. పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది.


