- మరోసారి రికార్డు ధరలకు అమ్ముడుపోయిన హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు
- రూ.24.26 కోట్ల మేర ఆదాయం
హైదరాబాద్,: హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్ ఉన్న కెపిహెచ్ బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్ల ను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1 మరియు 2 లోని ధర్మారెడ్డి కాలనీ లోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం నాడు బహిరంగ వేలం నిర్వహించారు.
మొత్తం 40 మంది కొనుగోలు దారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్ ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్దారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడు పోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారు. అదే విధంగా సంపూర్ణం అపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు (Flats) రూ .90 లక్షలను అప్ సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు.
ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్ కు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ శ్రీ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా (Open Plots) రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ల (Flats) ద్వారా రూ.8.45 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.


