సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయ్యారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
గత రెండేళ్లలో ఇప్పటివరకు నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు సహా మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 5,865 మంది లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు.
తెలంగాణ నుంచి మిగిలిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈస్ట్ డివిజనల్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్ విభాగం ఇన్చార్జి పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్ సుదర్శన్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జి వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, గణపతి భార్య.. మాడ్ డివిజన్ ఇన్చార్జి జోడే రత్నాభాయ్ అలియాస్ సుజాత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎడ్యుకేషన్ కమిటీ ఇన్చార్జి లక్కా సుశీల అలియాస్ రేల, దేవ్జీతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అనిల్కుమార్ అలియాస్ భగత్సింగ్, మాడ్ డిజినల్ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్ సంగీత, దేవ్జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్ కుంజం ఇడామల్ ఉన్నారు.


