తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస
సీఎం రేవంత్, కేసీఆర్, కిషన్రెడ్డి సహా పలువురి సంతాపం
నేడు చిలుకూరులో అంత్యక్రియలు
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చ కుడు, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందరరాజన్ (90) కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన ఐదేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. శుక్రవారం మధ్యా హ్నం అస్వస్థతకు గురికాగా, భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. వెంకటరాఘవాచారి– కోమలమ్మ దంపతులకు 1938 జూలై 4న సౌందరరాజన్ జన్మించారు. ఆయన బా ల్యం చెన్నైలో గడిచింది. 10వ తరగతి వరకు అక్కడే చదివా రు.
ఇంటర్ నుంచి పై చదువులు హైదరాబాద్లో పూర్తి చేశా రు. ఎంకామ్, ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఉపాధ్యా య వృత్తిలో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తిచేసి అక్కడే ప్రొఫెసర్గా చేరారు. వర్సిటీలో కీలక పదవులు నిర్వహించారు. చివరగా వర్సిటీ రిజిస్ట్రార్గా 1999 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.సౌందరరాజన్కు లక్ష్మీనరసింహన్, రంగరాజన్, మురళీధరన్ కుమారులు. ఆయన భార్య వసుమతి 2018లో మరణించారు.
ఆలయానికి ప్రత్యేక గుర్తింపు
సౌందరరాజన్ ఉద్యోగం చేసే సమయంలో సెలవులు ఉన్న ప్పుడు చిలుకూరు ఆలయానికి వచ్చి వెళ్లేవారు. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా చిలుకూరుకు వచ్చారు. 2000 నుంచి సౌందరరాజన్ ఈ ఆలయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చా రు. భగవంతుని సన్నిధిలో అందరూ సమానమేనని.. టికెట్లు, హుండీ, కానుకలు లేకుండా అందరూ ఒకే వరుసలో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలనే నినాదంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆలయంలో హుండీ తీసేశారు. సౌందరరాజన్ ప్రభుత్వంతో పోరాటం చేసి ఆలయం దేవాదాయ శాఖలోకి వెళ్లకుండా అడ్డుకొని.. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయంగా కొనసాగిస్తూ వచ్చారు.
దేవాలయాల పరిరక్షణ ఉద్యమంతో..
సౌందరరాజన్ జీర్ణ దేవాలయాల పరిరక్షణకు ఉద్యమాన్నే నడిపారు. హిందూ మత సంబంధిత సంస్థల నిర్వహణలో లోతైన జ్ఞానం, నిబద్ధత, అనుభవంతో పలు పుస్తకాలు రాశారు. పదేళ్ల పాటు అహోబిల మఠ సేవాసమితి కార్యదర్శిగా ఉన్నప్పుడు పొందిన జ్ఞానం, అనుభవాలను తాను రాసిన పుస్తకంలో పొందుపర్చారు. శ్రీనివాసనగర్ కాలనీలో గురువాయూర్ అప్పన్ ఆలయాన్ని స్థాపించిన కృష్ణ సమాజం సంస్థ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఉపాధ్యకుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
ఆలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్గా వాక్ (వాయిస్ ఆఫ్ టెంపుల్స్) త్రిభాషా(తెలుగు, హిందీ, ఇంగ్లిష్) మాస పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. శనివారం చిలుకూరులో సౌందరరాజన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
⇒ సౌందరరాజన్ మరణవార్త తెలిసి సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్గా ఎంతో మంచిపేరు గడించిన సౌందరరాజన్ ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు.
⇒ సౌందర రాజన్ మృతి హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సామాజిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ, తనదైన శైలిలో దైవసేవ చేయడం ద్వారా, ఆయన ప్రజా పూజారి గా ప్రసిద్ధి గాంచారని తెలిపారు.
⇒ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన సౌందరరాజన్ ఆదర్శనీయులని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఆయన చేసిన ఉద్యమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పని చేసిన సౌందరరాజన్ మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేర్కొన్నారు.
⇒ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సౌందరరాజన్ కుమారుడు రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సౌందరరాజన్ మృతి తీరని లోటని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: సౌందర రాజన్ కన్నుమూయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు చిలుకూరు బాలాజీ స్వామి సేవలో అంకితభావంతో పనిచేసిన సౌందర రాజన్ భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలోనూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని పేర్కొన్న వైఎస్ జగన్, సౌందర రాజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


