రోడ్డు విస్తరణ చేపట్టలేదు.. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు తొలగించలేదు.. పాదచారులు నడవడానికి వీలుగా ఫుట్పాత్లను అందుబాటులోకి తేలేదు.. రోడ్లపై గుంతలు పూడ్చలేదు.. వాహనదారుల సమస్యలు తెలుసుకోకుండా ట్రాఫిక్ రద్దీని అధ్యయనం చేయకుండా బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి శుక్రవారం తెరలేచింది.
మొదటి రోజునే పార్క్ హయత్ హోటల్ ముందు పిల్లర్ నిర్మాణానికి పునాదులు తీస్తుండగా ట్రాఫిక్ ఎన్టీఆర్ భవన్ వైపు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మొదటి పిల్లర్ నిర్మాణం కాకముందే వాహనదారులకు చుక్కలు కనిపించాయి. రెండేళ్ల పాటు ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం జరుగుతుందని సంబంధిత ఏజెన్సీ, ట్రాఫిక్ పోలీసులు వెల్లడించడంతో వాహనదారులు, పాదచారుల్లో ఆందోళన వ్యక్తమైంది. రెండేళ్ల పాటు ఈ ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఇప్పటి నుంచే భయాందోళనకు గురవుతున్నారు.
ఇంకో మార్గమే లేదు..
కేబీఆర్ పార్కు చౌరస్తాలో ప్రతిరోజూ గంటకు 12 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో గంటకు 13 వేలు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లో గంటలకు 10 వేల చొప్పున వాహనాలు సిగ్నల్ దాటుతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం జరుగుతోంది. ఈ వాహనదారులు వెళ్లాలంటే ఇంకో మార్గమే లేదు. మెయిన్రోడ్డు నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. కనీసం జీహెచ్ఎంసీ రోడ్లపై గుంతలు పూడ్చలేదు. రోడ్డు విస్తరణ చేపట్టలేదు. అడ్డుగా ఉన్న చెట్లను తొలగించలేదు. ఫుట్పాత్లు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి జీహెచ్ఎంసీ చేతులు దులుపుకోగా ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రించడం ట్రాఫిక్ పోలీసులకు మోయలేని బరువుగా తయారుకానుంది. ఈ రోడ్డులో వాహనాలు నియంత్రించడం అంతా ఆషామాషీ కాదు. జీహెచ్ఎంసీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా నిర్మాణ పనులు అప్పగించి చేతులు దులుపుకుంది.
ఏం చేయాలంటే..
కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్లపై గుంతలు పూడ్చి అనువైన చోట్ల రోడ్లను విస్తరించాలి.అలాగే ఫుట్పాత్లను అందుబాటులోకి తేవాలి.
అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు, కేబుళ్లను తొలగించాలి.
ట్రాఫిక్ మార్షల్స్ను నియమిస్తాం
కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం సందర్భంగా ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు తోడు 20 మంది ట్రాఫిక్ మార్షల్స్ను కూడా నియమించి వాహనాలు సజావుగా ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేందుకు ఓ వెహికల్ను కూడా అందుబాటులో ఉంచుతాం. నిరంతరం ట్రాఫిక్ పర్యవేక్షణ ఉంటుంది. ఫుట్పాత్లను అందుబాటులోకి తీసుకురావాలని మెఘా సంస్థ ప్రతినిధులకు సూచించాం. రోడ్డు పక్కన అక్రమ పార్కింగ్ చేయకుండా నిరంతర పహారా జరుగుతుంది. ప్రజలు, వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. అదనపు పోలీసులను కూడా ఇక్కడ వినియోగిస్తాం.
– జోయల్ డేవిస్,
ట్రాఫిక్ జాయింట్ సీపీ, హైదరాబాద్


